Saturday 28 July 2018

MID-DAY MEALS Program Extended to College's In Telangana

కాలేజీ పిల్లలకు మధ్యాహ్న భోజనం
ప్రభుత్వ జూనియర్‌, డిగ్రీ, పాలిటెక్నిక్‌ తదితర అన్ని కళాశాలల్లో..
5 లక్షల మందికి ప్రయోజనం
సచివాలయంలో మంత్రివర్గ ఉప సంఘం భేటీ


హైదరాబాద్‌: రాష్ట్రంలోని అన్ని ప్రభుత్వ కళాశాలల్లో మధ్యాహ్న భోజన పథకాన్ని అమలు చేయనున్నారు. ప్రస్తుతం కేంద్ర ప్రభుత్వ ఆర్థిక  భాగస్వామ్యంతో పాఠశాలల్లో అమలు చేస్తుండగా.. ఈ విద్యాసంవత్సరంలో రాష్ట్ర నిధులతో ప్రభుత్వ జూనియర్‌, డిగ్రీ, పాలిటెక్నిక్‌, బీఈడీ, డీఈడీ కళాశాలల్లో, ఆదర్శ పాఠశాలల్లోని ఇంటర్‌ విద్యార్థులకు శ్రీకారం చుట్టనున్నారు. దీనివల్ల మొత్తం అయిదు లక్షల మందికి లబ్ధి చేకూరనుందని సర్కారు భావిస్తోంది. ప్రభుత్వ జూనియర్‌ కళాశాలల్లో మధ్యాహ్న భోజనం అమలు చేయాలన్న ప్రతిపాదన రెండేళ్లుగా ఉంది. పథకం అమలుపై శుక్రవారం జరిగిన మంత్రి మండలి సమావేశంలో చర్చ జరిగింది. దీనిపై సాధ్యాసాధ్యాలను పరిశీలించాలని ముఖ్యమంత్రి కేసీఆర్‌ సూచించారు. ఈ క్రమంలో ఉప ముఖ్యమంత్రి కడియం శ్రీహరి నేతృత్వంలో మంత్రివర్గ ఉప సంఘం సభ్యులు ఈటల రాజేందర్‌, హరీశ్‌రావు, ఇంద్రకరణ్‌రెడ్డి శనివారం సచివాలయంలో సమావేశమై చర్చించారు.
‘అక్షయపాత్ర’ ద్వారా అమలు..
పాఠశాలల్లో వంట ఏజెన్సీ మహిళలు భోజనాన్ని వండుతున్నారు. కళాశాలల్లో వారికి అప్పగిస్తే మళ్లీ వంట గదులు నిర్మించాలి. పర్యవేక్షణ సమస్యలు పెరుగుతాయి. ఇప్పటికే కొన్ని మండలాల్లోని పాఠశాలల్లో మధ్యాహ్న భోజనం పథకం అమలును ‘అక్షయపాత్ర’ స్వచ్ఛంద సంస్థకు అప్పగించారు. కళాశాలల్లో అమలు బాధ్యతనూ ఆ సంస్థకే అప్పగించాలని భావిస్తున్నారు. సమావేశానికి ఆ సంస్థ ప్రతినిధులనూ ఆహ్వానించారు. ఒకవేళ ఆ సంస్థకు ఎక్కడైనా సరఫరా చేసే వీలు లేకపోతే సమీపంలోని మెస్సులు, హోటళ్ల ద్వారా సరఫరా చేయాలని ఉప సంఘం సభ్యులు చర్చించారు. మధ్యాహ్న భోజనాన్ని నాణ్యంగా, పౌష్టిక విలువలతో అందించేందుకు అక్షయపాత్ర ఫౌండేషన్‌ ప్రతినిధులను మూడు రకాల ప్రతిపాదనలు సిద్ధం చేయాలని కమిటీ అడిగింది. అయిదు లక్షల మంది విద్యార్థులకు కావాల్సిన సరకులన్నీ ఫౌండేషనే సమకూర్చుకొని అందించడం, పులిహోర, ఉప్మా, కొర్రలు, జొన్నలు, రాగులు, సజ్జలు వంటి పలు రకాల తృణ ధాన్యాలతో కూడిన ఆహారాన్ని అందించడంపై ప్రతిపాదనలు ఇవ్వాలని ఉపసంఘం సూచించింది. రాష్ట్రంలోని 31 జిల్లాల్లో అన్ని కళాశాలలకు భోజనం అందేవిధంగా కావాల్సిన కిచెన్లను ఏర్పాటు చేసుకోవాలని, మౌలిక సదుపాయాలు సమకూర్చుకోవాలని మంత్రులు సంస్థ ప్రతినిధులకు సూచించారు. ఆగస్టు 3న మరోసారి సమావేశం కావాలని నిర్ణయించారు. సమావేశంలో విద్యాశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి రంజీవ్‌ ఆచార్య, ఇంటర్‌బోర్డు కార్యదర్శి అశోక్‌, సమగ్ర శిక్షా అభియాన్‌ జేడీ రమేష్‌ తదితరులు పాల్గొన్నారు.

ఖర్చు ఏటా రూ.150 కోట్లు: ప్రభుత్వం 5 లక్షల మందికి లబ్ధి చేకూరుతుందని చెప్పినా ప్రభుత్వ కళాశాలల్లో విద్యార్థుల సంఖ్య సుమారు 3.50 లక్షలే. వారందరికీ పథకం అమలు చేయాలంటే రూ.150 కోట్లు ఖర్చవుతుందని అంచనా వేస్తున్నారు. అదే 5 లక్షల మంది అయితే రూ.200 కోట్ల వరకు నిధులు అవసరం అవుతాయి.

No comments:

Post a Comment

JOBS OPPORTUNITIES IN MANCHERIAL

మంచేరియల్ లో ఉద్యోగ అవకాశాలు