Thursday 28 June 2018

VRO ONLINE CLASS 4

1.  వర్తమానాంశాలు – ప్రాంతీయ, జాతీయ, అంతర్జాతీయ అంశాలు.

DAY 4

వర్తమానాంశాలు - ప్రాంతీయం  -  4

దిల్లీలో తెలంగాణ బోనాల శకటం
* 2015, జనవరి 26న జరిగిన 66వ గణతంత్ర వేడుకల్లో వివిధ రాష్ట్రాలు తమ సంప్రదాయ నృత్యాలు, సాంస్కృతిక వారసత్వాన్ని చాటుకునే రీతిలో శకటాలను రూపొందించి ప్రదర్శించాయి.
* తెలంగాణ ప్రభుత్వం 'బోనాల పండగ'కు ప్రతీకగా శకటాన్ని ప్రదర్శించింది.
సాలెపురుగుకు తెలంగాణ పేరు
* తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డాక కరీంనగర్ జిల్లా నాగ్నూర్ గ్రామంలో కొత్తగా గుర్తించిన సాలెపురుగుకు 'తెలంగాణ క్రాబ్ స్పైడర్' గా పేరు పెట్టినట్లు సాలెపురుగును కనుక్కున్న ఉస్మానియా విశ్వవిద్యాలయం జంతుశాస్త్ర విభాగం పేర్కొంది.
* రాష్ట్రం ఏర్పడ్డాక గుర్తించిన తొలి జీవరాశి కావడంతో ఈ పేరు పెట్టినట్లు తెలిపారు.
దక్షిణాది రాష్ట్రాల కార్మిక మంత్రుల సదస్సు
* దక్షిణాది రాష్ట్రాల కార్మిక మంత్రులు, కార్యదర్శుల మూడో ప్రాంతీయ సదస్సు హైదరాబాద్‌లో 2015, జూన్ 27న జరిగింది.
* ఈ సదస్సుకు ముఖ్య అతిథిగా కేంద్రకార్మిక శాఖామంత్రి బండారు దత్తాత్రేయ హాజరయ్యారు.
'ఉనికి' పుస్తకావిష్కరణ
* తెలంగాణకు చెందిన మహారాష్ట్ర గవర్నరు సీహెచ్ విద్యాసాగర్‌రావు రాసిన 'ఉనికి పుస్తకాన్ని రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ 2015, జులై 3న ఆవిష్కరించారు.
* విద్యాసాగరరావు గతంలో వివిధ పత్రికలకు రాసిన వ్యాసాలను 'ఉనికి పేరుతో పుస్తక రూపంలోకి తీసుకువచ్చారు.
సోలార్ నగరంగా మహబూబ్‌నగర్
* కేంద్ర నూతన, పునర్వినియోగ ఇంధన మంత్రిత్వ శాఖ (ఎంఎన్ఆర్ఈ) ఎంపిక చేసిన మొత్తం 55 సోలార్ నగరాల్లో తెలంగాణలోని మహబూబ్‌నగర్‌కు చోటు లభించింది.
* 2015 ఆగస్టులో సోలార్ నగరాల జాబితాను ప్రకటించారు.
* ఈ కార్యక్రమంలో భాగంగా ఒక్కో నగరానికి జనాభా ఆధారంగా 50 లక్షల రూపాయల వరకు ఆర్థికసాయం లభిస్తుంది.
గోల్కొండ కోటలో పంద్రాగస్టు వేడుకలు
* తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావం అనంతరం రెండోసారి స్వాతంత్య్ర దినోత్సవాలను గోల్కొండ కోటలో 2015, ఆగస్టు 15న తెలంగాణ ప్రభుత్వం నిర్వహించింది.
* గోల్కొండ కోటలో జరిగిన 69వ స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలకు ముఖ్యమంత్రి కె.చంద్రశేఖరరావు హాజరయ్యారు, రాష్ట్రంలో అమలు చేస్తున్న సంక్షేమ కార్యక్రమాల గురించి ప్రసంగించారు.
అవినీతిలో 'రెవెన్యూ'
* ప్రభుత్వ శాఖల్లో అవినీతి, ఇతర సమస్యలపై ప్రజల నుంచి ఫిర్యాదులు స్వీకరించేందుకు తెలంగాణ ప్రభుత్వం ఏర్పాటు చేసిన టోల్‌ఫ్రీ నంబరుకు 6 నెలల కాలంలో వచ్చిన ఫిర్యాదులు పరిశీలించగా రెవెన్యూ శాఖ అగ్రస్థానంలో ఉంది. పోలీసు శాఖ రెండో స్థానంలో ఉంది. ఆ తర్వాత స్థానాల్లో నిత్యం ప్రజలతో ప్రత్యక్ష సంబంధాలు జరిపే పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి, ఆరోగ్య శాఖలు ఉన్నాయి.
* వరంగల్ జిల్లా నుంచి అత్యధికంగా, ఆదిలాబాద్ జిల్లా నుంచి అతి తక్కువగా ఫిర్యాదులొచ్చాయి.
కృష్ణారెడ్డి మృతి
* తెలంగాణ శాసనసభ ప్రజాపద్దుల కమిటీ (పీఏసీ) ఛైర్మన్, మెదక్ జిల్లా నారాయణఖేడ్ ఎమ్మేల్యే (కాంగ్రెస్) పట్టోళ్ల కృష్ణారెడ్డి(73) 2015, ఆగస్టు 25న గుండెపోటుతో మరణించారు.
* కృష్ణారెడ్డి 1989, 1999, 2004, 2014లలో ఎమ్మెల్యేగా విజయం సాధించారు.
* గతంలో రెండుసార్లు పీఏసీ ఛైర్మన్‌గా పనిచేశారు. తిరిగి గత 6 నెలలుగా ఆ పదవిలో కొనసాగుతున్నారు.
స్మార్ట్ నగరాలు
* దేశంలో 100 నగరాలను ఆకర్షణీయ నగరాలు(స్మార్ట్ సిటీలు)గా తీర్చిదిద్దేందుకు కేంద్ర ప్రభుత్వం నిర్ణయించింది. ఈ కార్యక్రమంలో భాగంగా 98 నగరాల జాబితాను కేంద్రం 2015, ఆగస్టు 27న ప్రకటించింది. (ఉత్తరప్రదేశ్‌లో ఒకటి, జమ్మూకశ్మీర్‌లో ఒకటి పెండింగ్‌లో ఉన్నాయి)
* తాజాగా ప్రకటించిన జాబితాలో తెలంగాణ రాష్ట్రం నుంచి హైదరాబాద్, వరంగల్ నగరాలు ఎంపికయ్యాయి.
* అత్యధికంగా ఉత్తర్‌ప్రదేశ్‌లో 13, తమిళనాడులో 12, మహారాష్ట్రలో 10 నగరాలు ఎంపికయ్యాయి. ఆంధ్రప్రదేశ్‌లో 3 నగరాలు ఎంపికయ్యాయి.
* తెలంగాణ నుంచి ఎంపికైన రెండు గ్రేటర్ నగరాలు... రాష్ట్రంలో అత్యధిక జనాభా ఉన్న మొదటి, రెండు నగరాలు కూడా ఇవే.
* ఈ కార్యక్రమం కోసం కేంద్ర ప్రభుత్వం రూ.48 వేల కోట్లు ఖర్చు చేయనుంది. రాష్ట్రాలు, పురపాలక సంస్థలు అంతే మొత్తాన్ని సమకూర్చవలసి ఉంటుంది.
హైదరాబాద్‌లో గూగుల్ క్యాంపస్
* గూగుల్ సంస్థ ఆసియాలోనే తన తొలి క్యాంపస్‌ని హైదరాబాద్‌లో ఏర్పాటు చేయనుంది. ఇందులో భాగంగా కాలిఫోర్నియాలో గూగుల్, రాష్ట్ర ప్రభుత్వం మధ్య ఒప్పందం కుదిరింది.
* ఇది అమెరికా వెలుపల ఉన్న గూగుల్ క్యాంపస్‌లలో అతిపెద్దది కానుంది.
* 2016లో దీని నిర్మాణం ప్రారంభించి నాలుగేళ్లలో పూర్తి చేయనున్నారు. రూ.1000 కోట్లుతో దీన్ని ఏర్పాటు చేయనున్నారు.
'అందరికీ ఇళ్లు' పథకం
* పట్టణ ప్రాంత పేదల కోసం దేశ వ్యాప్తంగా 2022 నాటికి 2 కోట్ల ఇళ్లు నిర్మించడం లక్ష్యంగా కేంద్ర ప్రభుత్వం 'అందరికీ ఇళ్లు' (హౌసింగ్ ఫర్ ఆల్ అర్బన్) పథకాన్ని ప్రవేశపెట్టింది.
* ఈ పథకం కోసం కేంద్ర ప్రభుత్వం దేశంలో 9 రాష్ట్రాల నుంచి 305 నగరాలు, పట్టణాలను ఎంపిక చేసింది.
* వీటిలో తెలంగాణ నుంచి 34 నగరాలు, పట్టణాలు ఎంపికయ్యాయి. పథకం అమలు బాధ్యతను నోడల్ ఏజెన్సీ అయిన పట్టణ పేదరిక నిర్మూలన మిషన్ తీసుకుంది.
* ఈ కార్యక్రమం కింద కేంద్రం 2015-2022 మధ్య రూ. 2 లక్షల కోట్లు ఖర్చు చేయనుంది.
* పథకం ముఖ్య ఉద్దేశం 'మురికివాడల నిర్మూలన'.
కేసీఆర్ చైనా పర్యటన
* రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ సెప్టెబరు 7 - 16 తేదీల మధ్య చైనాలో పర్యటించారు.
పర్యటన ముఖ్యాంశాలు:
* నూతన రాష్ట్ర ఉనికి, పురోగతిని విశ్వవ్యాప్తం చేయడం.
* పారిశ్రామిక విధాన విశిష్టతలను తెలియజెప్పడం.
* రూ.50 వేల కోట్ల పెట్టుబడుల సమీకరణ.
తెలంగాణ ఎక్స్‌ప్రెస్
* హైదరాబాద్ - న్యూదిల్లీల మధ్య నడుస్తున్న ఏపీ ఎక్స్‌ప్రెస్ (నెం.12723/12724) రైలు పేరును తెలంగాణ ఎక్స్‌ప్రెస్‌గా మారుస్తూ రైల్వేశాఖ నిర్ణయం తీసుకుంది.
* 2015, నవంబరు 15 నుంచి కొత్తపేరు అమల్లో వస్తుంది.
* హైదరాబాద్-సిర్పూర్ కాగజ్‌నగర్ మధ్య నడిచే తెలంగాణ ఎక్స్‌ప్రెస్ పేరును ఇదివరకే కాగజ్‌నగర్ ఎక్స్‌ప్రెస్‌గా మార్చారు.
పాలకుర్తి మార్కెట్‌కి ఐలమ్మ పేరు
* వీరనారి, తెలంగాణ సాయుధ పోరాట యోధురాలు చాకలి ఐలమ్మ పేరును వరంగల్ జిల్లా పాలకుర్తి ఉప మార్కెట్‌యార్డుకు పెడుతూ మార్కెటింగ్ శాఖ ఉత్తర్వులు జారీ చేసింది.
* ఇదివరకు తెలంగాణ రాష్ట్ర అవతరణను పురస్కరించుకుని 2015, జూన్ 2 నుంచి వీరనారి చాకలి ఐలమ్మ జీవిత చరిత్రను ధారావాహిక (సీరియల్)గా ప్రారంభించారు.
మోదీతో సంభాషణకు ఇద్దరి ఎంపిక
* ఉపాధ్యాయ దినోత్సవానికి ముందు రోజు దేశవ్యాప్తంగా విద్యార్థులతో ప్రధాని నరేంద్ర మోదీ ముఖాముఖికి (ఆన్‌లైన్ ద్వారా) తెలంగాణ నుంచి ఇద్దరు విద్యార్థులను ఎంపిక చేశారు.
* ఎవరెస్ట్ పర్వతారోహణ చేసిన పూర్ణ, ఏషియన్ యోగా ఛాంఫియన్ షిప్‌లో కాంస్య పతకం నెగ్గిన సుందర్ రాజ్‌లు ఎంపికయ్యారు.
* వీరిద్దరూ సెప్టెంబరు 4న ప్రధానితో సంభాషణలో నేరుగా మాట్లాడారు.


వర్తమానాంశాలు - జాతీయం   -   4

కేంద్ర బడ్జెట్, రైల్వే బడ్జెట్ల గణాంకాలు.. ఆర్థిక సర్వే అంచనాలు.. రాష్ట్రాలకు కేంద్ర వాటాలో పెంపు - తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌లకు కేటాయింపులు.. రక్షణ రంగంలో స్పెయిన్‌తో ఒప్పందం.. క్లోనింగ్‌లో భారత పరిశోధకులు సాధించిన ఘనత.. అవార్డులు, రైతు కార్డులు, ప్రవాస భారతీయులకు చేయూత.. పోటీ పరీక్షలకు ఉపయోగపడే ఇలాంటి ఎన్నో జాతీయ విషయ విశేషాలు తెలుసుకుందాం...
14 కోట్ల మంది రైతుల కోసం..
రాజస్థాన్‌లోని సూరత్‌గఢ్‌లో 'భూసార కార్డు పథకం'ను ప్రధాని నరేంద్ర మోదీ 2015 ఫిబ్రవరి 19న ప్రారంభించారు. ఎరువులను సమతౌల్యంగా ఉపయోగించే విధానాన్ని ప్రోత్సహించే ఉద్దేశంతో వచ్చే మూడేళ్లలో 14 కోట్ల మంది రైతులకు భూసార కార్డులు ఇవ్వాలని కేంద్ర ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది. ఏ పంటకు ఏ ఎరువు అవసరమో కార్డులో వివరంగా సిఫార్సు చేస్తారు.
ఆన్‌లైన్ చేయూత
విదేశాల్లో నివసిస్తున్న భారత పౌరులు దౌత్య కార్యాలయాల పరంగా ఎదుర్కొనే సమస్యల పరిష్కారానికి కేంద్ర ప్రభుత్వం 'మదత్' (చేయూత) పేరుతో ప్రత్యేక ఈ-పోర్టల్‌ను ప్రారంభించింది. దౌత్య కార్యాలయాల పరంగా ఎదుర్కొనే సమస్యలను ఇకపై ఆన్‌లైన్‌లోనే నమోదు చేయవచ్చు. అత్యధిక జవాబుదారీతనంతో ఆయా ఫిర్యాదులను సత్వరం పరిష్కరించేందుకు 'మదత్' పోర్టల్ సాయపడుతుంది.
పన్నుల్లో వాటా పెంపు
కేంద్రం నుంచి రాష్ట్రాలకొచ్చే పన్నుల వాటా గణనీయంగా పెరిగింది. మునుపెన్నడూ లేని స్థాయిలో ఆ వాటాను 10 శాతం పెంచుతూ కేంద్రం నిర్ణయం తీసుకుంది. కేంద్ర పన్నుల్లో రాష్ట్రాల వాటా గతంలో 32 శాతం ఉండగా 42 శాతానికి పెంచాలని ఆర్‌బీఐ మాజీ గవర్నరు వై.వి.రెడ్డి నేతృత్వంలోని 14వ ఆర్థిక సంఘం చేసిన సిఫార్సును కేంద్రం ఆమోదించింది. తాజా నిర్ణయం ప్రకారం రాష్ట్రాలకు కేంద్రం 2015-16లో అదనంగా రూ. 1.78 లక్షల కోట్లు ఇవ్వనుంది. అయితే రాష్ట్రాలకు గ్రాంట్లు సిఫార్సు చేసే విషయంలో 14వ ఆర్థిక సంఘం ప్రణాళిక, ప్రణాళికేతర అనే వర్గీకరణను పరిగణనలోకి తీసుకోలేదు. రాష్ట్రాల మొత్తం ఆదాయ, వ్యయ అవసరాలను పరిగణనలోకి తీసుకుంది.
* 1971 నాటి జనాభాను, అప్పటి నుంచి జనాభాలో వచ్చిన మార్పులు, ఆదాయ వ్యత్యాసాలు, అటవీ విస్తీర్ణం లాంటి అంశాలను పరిగణనలోకి తీసుకుని.. ఈ 42 శాతం వాటాలో 14వ ఆర్థిక సంఘం రాష్ట్రాలకు కేటాయింపులు జరిపింది. రాష్ట్రాలకు కేటాయించిన మొత్తంలో తెలంగాణకు 2.437 శాతం, ఆంధ్రప్రదేశ్‌కు 4.305 శాతం వాటాగా ఆర్థిక సంఘం నిర్ణయించింది. అలాగే సేవాపన్ను (సర్వీస్ ట్యాక్స్)లో తెలంగాణ వాటా 2.499 శాతంగా, ఏపీ వాటా 4.398 శాతంగా నిర్ధారించింది. వీటికి అదనంగా స్థానిక సంస్థలకు గ్రాంట్లను కూడా సిఫార్సు చేసింది.
* విభజన కారణంగా ఆదాయలోటు ఏర్పడిన ఆంధ్రప్రదేశ్‌కు గ్రాంటు మంజూరు చేయాలని ఆర్థిక సంఘం సిఫార్సు చేసింది. దీని ప్రకారం ఆంధ్రప్రదేశ్‌కు 2015 నుంచి 2020 వరకు దక్కే మొత్తం రూ.22,113 కోట్లు. ఆదాయలోటు ఏర్పడిన మరో 10 రాష్ట్రాలకు (జమ్మూకశ్మీర్, హిమాచల్‌ప్రదేశ్, నాగాలాండ్, మిజోరం, పశ్చిమ్‌బంగ, మణిపూర్, కేరళ, త్రిపుర, అసోం, మేఘాలయ) 2015 నుంచి 2020 వరకు రూ.1.94 లక్షల కోట్ల మంజూరుకు సిఫార్సు చేసింది.
కొత్తరైలు లేని బడ్జెట్
2015-16 ఆర్థిక సంవత్సరానికి రైల్వే బడ్జెట్‌ను రైల్వే మంత్రి సురేష్ ప్రభు 2015, ఫిబ్రవరి 26న పార్లమెంటుకు సమర్పించారు. గతంలో ఎన్నడూలేని విధంగా ఈ బడ్జెట్‌లో ఒక్క కొత్తరైలు, రైలుమార్గాన్ని ప్రకటించలేదు. ఉన్న రైళ్ల సామర్థ్యాన్ని పెంచుతామని, ప్రసుత్త రైలుమార్గాలను పొడిగించి బలోపేతం చేస్తామని ప్రకటించారు. ప్రణాళికా వ్యయం కింద రూ.1,00,011 కోట్లు కేటాయించారు. గత బడ్జెట్ మొత్తం కంటే ఇది 52 శాతం ఎక్కువ. ఈ ఆర్థిక సంవత్సరంలో రైల్వేలకు స్థూల బడ్జెటరీ మద్దతు కింద రూ.40,000 కోట్లను కేటాయించారు. ఇది గత ఆర్థిక సంవత్సరం కంటే రూ.10,000 కోట్లు అధికం. రైల్వేశాఖను లాభాల బాట పట్టించేందుకు నిర్వహణ నిష్పత్తి (రాబడిలో మొత్తం ఖర్చు)ని ఈ ఆర్థిక సంవత్సరంలో 88.5 శాతానికి తీసుకురావాలన్నది తమ లక్ష్యమని సురేష్ ప్రభు ప్రకటించారు. రాబడిని రూ.25 వేల కోట్లు పెంచేందుకు చర్యలు చేపడతామని ఆయన పేర్కొన్నారు.
పౌరసత్వ (సవరణ) చట్టం-2015
భారత సంతతి వ్యక్తులకు శాశ్వత వీసా సదుపాయం కల్పించగల 'పౌరసత్వ (సవరణ) చట్టం-2015' బిల్లును కేంద్ర ప్రభుత్వం 2015 ఫిబ్రవరిలో లోక్‌సభలో ప్రవేశపెట్టింది. దీంతో పర్సన్ ఆఫ్ ఇండియన్ ఆరిజన్ (పీఐవో), ఓవర్‌సీస్ సిటిజన్‌షిప్ ఆఫ్ ఇండియా (వోసీఐ) కార్డు పథకాలు విలీనమయ్యేందుకు మార్గం సుగమమైంది. ఈ రెండింటినీ కలుపుతామంటూ ప్రధాని మోదీ అమెరికా పర్యటన సందర్భంగా న్యూయార్క్‌లో భారతీయులకు ఇచ్చిన హామీని ఈ బిల్లు నెరవేరుస్తుంది.
ఆర్థిక సర్వే 2014-15
కేంద్ర బడ్జెట్‌ను ప్రవేశపెట్టడానికి ఒక రోజు ముందు ఆర్థిక సర్వేను ప్రవేశపెట్టడం ఆనవాయితీ. దీన్ని కొనసాగిస్తూ 2015, ఫిబ్రవరి 27న కేంద్ర ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ ఆర్థిక సర్వేను లోక్‌సభలో ప్రవేశపెట్టారు. రాబోయే సంవత్సరాల్లో ద్రవ్యలోటును స్థూల జాతీయోత్పత్తిలో 3 శాతానికి తగ్గించాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది. కరెంటు ఖాతా లోటు (క్యాడ్) 2015-16లో 1 శాతానికి పడిపోతుందని ప్రభుత్వం అంచనా వేసింది. 2015-16 ఆర్థిక సంవత్సరంలో రిటైల్ ద్రవ్యోల్బణం 5 నుంచి 5.5 శాతం మధ్య ఉండొచ్చని అంచనా వేసింది. ఆహారధాన్యాల ఉత్పత్తి 2014-15 ఏడాదికి 257.07 మిలియన్ టన్నులు ఉంటుందన్నది ప్రభుత్వ అంచనా. గత అయిదేళ్ల సగటు కంటే ఇది 8.5 మిలియన్ టన్నులు ఎక్కువ. దేశంలో నిలిచిపోయిన ప్రాజెక్టుల్లోని పెట్టుబడులు జీడీపీలో 7 శాతానికి సమానమని ప్రభుత్వ ఆర్థిక సర్వేలో వెల్లడైంది. బ్యాంకులు, బీమా రంగంలో భారీ సంస్కరణలతో 2013లో బీమా వ్యాప్తి 3.9 శాతానికి చేరిందని, 2000లో ఇది 2.3 శాతంగా ఉందని ప్రభుత్వం వెల్లడించింది. ప్రభుత్వరంగ బ్యాంకుల మొండి బకాయిల్లో మౌలిక, ఇనుము-ఉక్కు, జౌళి, గనులు, విమానయాన రంగాలు మొత్తం 54 శాతం వాటాను కలిగి ఉన్నాయని సర్వే పేర్కొంది. గత కొన్నేళ్లుగా పెట్టుబడుల్లో ఆలస్యం కారణంగా 2014 డిసెంబరు చివరి నాటికి రూ. 8.8 లక్షల కోట్ల ప్రాజెక్టులు ఆగిపోయాయని సర్వే స్పష్టం చేసింది. మొత్తం ఆగిపోయిన ప్రాజెక్టుల్లో మౌలిక రంగాల కంటే తయారీ రంగానివే ఎక్కువ ఉండటం గమనార్హం. దేశంలో ఆహార, ఇంధన, రైల్వే, ఎరువుల రూపేణా ఏటా రూ. 3.77 లక్షల కోట్ల మేర ప్రభుత్వం సబ్సిడీ అందిస్తోంది. ఇందులో అర్హులకు చేరేది కొంతేనని సర్వే తేల్చింది. 2012-13లో దేశ వాణిజ్య లోటు 190.3 బిలియన్ డాలర్లు (రూ.11,41,800 కోట్లు) కాగా 2013-14లో 135.8 బిలియన్ డాలర్ల (రూ.8,14,800 కోట్లు)కు దిగి వచ్చింది.
కేంద్ర బడ్జెట్ 2015-16
ఉపాధి కల్పన, సామాజిక భద్రత, వృద్ధిరేటు పెంపు ప్రధానాంశాలుగా 2015-16 కేంద్ర బడ్జెట్‌ను ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ 2015, ఫిబ్రవరి 28న పార్లమెంటులో ప్రవేశపెట్టారు. బడ్జెట్ మొత్తం విలువ రూ.17,77,477 కోట్లు. ఇందులో ప్రణాళిక వ్యయం రూ.4,65,277 కోట్లు కాగా ప్రణాళికేతర వ్యయం రూ.13,12,200 కోట్లు.

రక్షణ రంగంలో భారత్-స్పెయిన్
రక్షణ రంగంలో సహకారాన్ని పెంపొందించుకునే దిశగా భారత్, స్పెయిన్ 2015 మార్చిలో 'పరస్పర రహస్య సమాచార రక్షణ ఒప్పందం'పై సంతకాలు చేశాయి. రక్షణ, పరిశోధన, అభివృద్ధి, సాంకేతిక పరిజ్ఞానంలో సహకార విధి విధానాల రూపకల్పనకు ఈ ఒప్పందం తోడ్పడుతుంది. స్పెయిన్ రక్షణ మంత్రి పెడ్రో మోరెనెస్ భారత పర్యటనలో భాగంగా ఈ ఒప్పందం కుదిరింది.
డిజిటల్ జెండర్ అట్లాస్
లింగ వివక్ష నేపథ్యంలో ఏయే పథకాలు ఎలా అమలవుతున్నాయో సులభంగా గుర్తించగలిగేలా డిజిటల్ రూపంలో పటాన్ని (డిజిటల్ జెండర్ అట్లాస్) కేంద్ర ప్రభుత్వం 2015 మార్చిలో రూపొందించింది. ముఖ్యంగా బాలికల విద్యాపథకాలు, కార్యక్రమాల సమర్థ అమలు కోసం దీన్ని రూపొందించారు. అంతర్జాలం ఆధారంగా ఇది పనిచేస్తుంది. యునిసెఫ్ సహకారంతో ఈ అట్లాస్‌ను రూపొందించారు.
క్లోన్డ్ గేదె దూడ 'అపూర్వ'
గేదె మూత్రంలోని సొమాటిక్ కణాలను ఉపయోగించి భారత పరిశోధకులు ప్రపంచంలోనే తొలిసారిగా క్లోనింగ్ నిర్వహించారు. హరియాణాలోని కర్నాల్‌లో ఉన్న జాతీయ పాడి పరిశోధన సంస్థ (ఎన్‌డీఆర్ఐ) శాస్త్రవేత్తలు ఈ ఘనత సాధించారు. ఈ విధానంలో పుట్టిన దూడకు 'అపూర్వ' అని పేరు పెట్టారు. ప్రఖ్యాతిగాంచిన ముర్రా జాతి గేదెకు ఇది క్లోన్డ్ రూపం. ముర్రా జాతి గేదెలు ఎక్కువ పరిమాణంలో పాలు ఇస్తాయి. గేదె మూత్రంలోని ఒక విసర్జిత పదార్థం నుంచి దాత కణాలను వేరుచేశారు. అనంతరం హ్యాండ్ గైడెడ్ క్లోనింగ్ పరిజ్ఞానాన్ని ప్రయోగించారు. ఈ విధానం జీవకణాలు వేగంగా వృద్ధి చెందేందుకు దోహదపడుతుంది.
హర్విందర్ రూపొందించిన వీడియో
నిర్భయ ఉదంతం నేపథ్యంలో బ్రిటన్ వనిత లెస్లీ ఉడ్విన్ చిత్రీకరించిన వివాదాస్పద 'ఇండియాస్ డాటర్' డాక్యుమెంటరీకి ప్రతిస్పందనగా 'యునైటెడ్ కింగ్‌డమ్స్ డాటర్' అనే డాక్యుమెంటరీని భారత్‌కు చెందిన హర్విందర్ సింగ్ రూపొందించారు. బ్రిటన్ పత్రిక టెలిగ్రాఫ్ కథనం ప్రకారం.. లైంగిక వేధింపులనేవి భారత్‌కు సంబంధించినవి మాత్రమే కావని, ప్రపంచవ్యాప్తంగా ఉన్నాయని చాటిచెప్పేందుకే హర్విందర్ ఈ వీడియోను రూపొందించారు.
తొలిసారిగా ఇద్దరికి..
ప్రముఖ శాస్త్రవేత్త డాక్టర్ యలవర్తి నాయుడమ్మ స్మారక పురస్కారాన్ని 2014 సంవత్సరానికి మహిళా శాస్త్రవేత్తలు టెస్సీ థామస్, గీతావరదన్‌లకు ప్రదానం చేశారు. తొలిసారిగా ఈ అవార్డును ఇద్దరికి ప్రకటించారు. అగ్ని క్షిపణి ప్రయోగంలో సేవలందించి 'అగ్ని పుత్రిక'గా, 'క్షిపణి మహిళ'గా టెస్సీ థామస్ పేరుగాంచారు. అగ్రశ్రేణి ఉపగ్రహ సమాచార శాస్త్రవేత్తగా గీతావరదన్ ఖ్యాతి పొందారు.



వర్తమానాంశాలు - అంతర్జాతీయం   -  4

విశ్వవ్యాప్తంగా ఎక్కడ ఏం జరిగింది? ఏం జరుగుతోంది? తెలుసుకుంటే ఎంతో విజ్ఞానం మన సొంతమవుతుంది. ప్రపంచ ప్రఖ్యాత పురస్కారాలు.. అద్భుత ఆవిష్కరణలు.. ప్రపంచ సంస్థలు వెల్లడిస్తున్న జాబితాలు.. భూమండల వాతావరణ రికార్డులు.. ఒకటేమిటి? ఎన్నో సంగతుల సమాహారం పోటీ పరీక్షలకు సిద్ధమవుతున్న అభ్యర్థుల కోసం..
రూ. 6 లక్షల కోట్లు మరి!

* 2015 ఫిబ్రవరిలో నల్లకుబేరులకు సంబంధించిన ఓ జాబితా వెలుగు చూసింది. ప్రపంచవ్యాప్తంగా లక్ష మందికి పైగా ఖాతాదారుల వివరాలు ఇందులో ఉండటం సంచలనం సృష్టించింది. స్విట్జర్లాండ్‌లోని హెచ్ఎస్‌బీసీ బ్యాంకులో ఉన్న ఈ ఖాతాల వివరాలను అంతర్జాతీయ పరిశోధనాత్మక పాత్రికేయుల వేదిక (ఇంటర్నేషనల్ కన్సార్టియమ్ ఆఫ్ ఇన్వెస్టిగేటివ్ జర్నలిస్ట్స్ - ఐసీఐజే) బయటపెట్టింది. దీని ప్రకారం.. లక్షమంది దాచుకున్న మొత్తం సంపద 100 బిలియన్ డాలర్లు (సుమారు రూ. 6 లక్షల కోట్లు).
* ఈ జాబితాలో భారత్‌కు చెందిన 1,195 మంది ప్రముఖ వ్యాపారవేత్తలు, రాజకీయ నాయకులు, మాజీ అధికారుల పేర్లున్నాయి. ప్రస్తుత విదేశీ మారక విలువల ఆధారంగా లెక్కించినప్పుడు ఆ ఖాతాల్లోని నిల్వలు 400 కోట్ల డాలర్ల (రూ. 25,420 కోట్లు)కు పైగా ఉన్నాయి.
గ్రామీ అవార్డులు - 2015

* సంగీత రంగంలో అంతర్జాతీయ స్థాయి పురస్కారంగా పేరొందిన గ్రామీ అవార్డులను (57వ) 2015 ఫిబ్రవరిలో అమెరికాలోని లాస్ఏంజిల్స్‌లో ప్రదానం చేశారు. మన దేశానికి చెందిన రికీకేజ్, నీలావిశ్వానీలు పురస్కార గ్రహీతల్లో ఉన్నారు. బెంగళూరుకు చెందిన 33 ఏళ్ల రికీకేజ్‌కు 'న్యూఏజ్ ఆల్బమ్' విభాగంలో గ్రామీ అవార్డు లభించింది. దక్షిణాఫ్రికా కళాకారుడు వౌటర్ కెల్లెర్మాన్‌తో కలిసి రికీకేజ్ మహాత్మాగాంధీ స్ఫూర్తితో 'విండ్స్ ఆఫ్ సంసారా' అనే ఆల్బమ్‌ను రూపొందించారు.
* మరో గ్రామీ అవార్డు పురస్కారాన్ని భారత్‌కు అందించిన నీలా విశ్వానీ వాస్తవానికి రచయిత్రి. ఆమె చిన్నకథల సంపుటాలను వెలువరించారు. పాకిస్థాన్‌లో బాలికల విద్య కోసం ప్రాణాలను లెక్క చేయకుండా పోరాడిన నోబెల్ శాంతి బహుమతి గ్రహీత మలాలా యూసఫ్ జాయ్ జీవిత కథ (ఐ యాం మలాలా)కు నీలావిశ్వానీ ధ్వని రూపం (ఆడియో) కల్పించారు. ఐయాం మలాలా! పేరుతోనే తెచ్చిన ఈ ఆల్బమ్‌లో మలాలా స్వీయచరిత్రను విశ్వానీ వివరించారు. 'ఉత్తమ పిల్లల ఆల్బమ్' విభాగంలో ఇది అవార్డుకు ఎంపికైంది.
ఈ ఏడాది గ్రామీ విజేతలు: ఉత్తమ ఆల్బమ్ - మార్నింగ్ ఫేజ్ (గాయకుడు బెక్), ఉత్తమ రికార్డ్ - స్టే విత్‌మీ (గాయకుడు శాంస్మిత్), ఉత్తమ పాట - స్టే విత్‌మీ (శాంస్మిత్, జిమ్మీ నేప్స్, విలియం ఫిలిప్స్), ఉత్తమ కొత్త కళాకారుడు - శాంస్మిత్, ప్రజాదరణ పొందిన ఓకల్ ఆల్బమ్ - ఇన్ ది లోన్లీ అవర్ (శాంస్మిత్).
వరల్డ్ ప్రెస్‌ఫొటో పురస్కారాలు

* ప్రతిష్ఠాత్మక వరల్డ్ ప్రెస్ ఫొటో పురస్కారం-2015ను డెన్మార్క్ ఫొటోగ్రాఫర్ మాడ్స్ నిస్సేన్ గెలుచుకున్నారు. ఈయన తీసిన రష్యా స్వలింగ సంపర్క జంట ఫొటోకు ఈ అవార్డు దక్కింది. రష్యాలో స్వలింగ సంపర్కులు, లింగమార్పిడి చేయించుకున్న వారు ఎదుర్కొంటున్న సమస్యలు, కష్టాలను ప్రపంచానికి తెలియజేయాలనే ఉద్దేశంతో ఆ ఫొటోను ఎంపిక చేసినట్లు నిర్వాహకులు వెల్లడించారు. అతడికి సమకాలిన సమస్య విభాగంలో కూడా పురస్కారం దక్కింది.

వేడెక్కిన జనవరి

* ప్రపంచ వ్యాప్తంగా భూమి, సముద్ర ఉపరితలాలపై సగటు ఉష్ణోగ్రత 2015 జనవరిలో రికార్డుస్థాయిలో నమోదైనట్లు అమెరికా జాతీయ సముద్ర, వాతావరణ సంస్థ (నేషనల్ ఓషియానిక్ అండ్ అట్మాస్ఫిరిక్ అడ్మినిస్ట్రేషన్- ఎన్‌వోఏఏ) పేర్కొంది. ఉష్ణోగ్రతల రికార్డుల్ని 1880 నుంచి నమోదు చేస్తుండగా.. ఆ ఏడాది నుంచి చూస్తే ఇది రెండో స్థానంలో ఉన్నట్లు తెలిపారు. ప్రపంచవ్యాప్తంగా జనవరిలో భూమి, సముద్ర ఉపరితల సగటు ఉష్ణోగ్రత 0.77 డిగ్రీల సెల్సియస్‌గా ఉంది. ఇది 20వ శతాబ్దం సగటుకన్నా ఎక్కువే. అంతకుముందు 2007లో 0.86 డిగ్రీల సెల్సియస్‌తో అత్యధిక స్థాయి సగటు నమోదైంది.
* 2015 జనవరిలో భూమి ఉపరితల సగటు ఉష్ణోగ్రత 1.43 డిగ్రీల సెల్సియస్‌తో 20వ శతాబ్దపు సగటుకన్నా ఎక్కువగా నమోదైంది. ఇది కూడా రెండో స్థానంలో ఉండగా, అత్యధికంగా 2007లో 1.84 డిగ్రీల సెల్సియస్ నమోదైంది. 2015 జనవరిలో సముద్ర ఉపరితల ఉష్ణోగ్రత 0.53 డిగ్రీల సెల్సియస్ సగటుతో 20వ శతాబ్దం సగటుకన్నా అధికంగా నమోదైంది. ఇది మూడోస్థానంలో నిలిచింది.
ఆస్కార్ అవార్డులు-2015

* 2015 ఫిబ్రవరిలో అమెరికాలోని లాస్ఏంజిల్స్‌లో 87వ ఆస్కార్ అవార్డులను ప్రదానం చేశారు. బర్డ్‌మ్యాన్, ది గ్రాండ్ బుడాపెస్ట్ హోటల్ - చిత్రాలు నాలుగేసి పురస్కారాలు దక్కించుకున్నాయి.
పురస్కార గ్రహీతలు
ఉత్తమ చిత్రం - బర్డ్‌మ్యాన్
ఉత్తమ నటుడు - ఎడ్డి రెడ్‌మేన్ (ది థిµయరీ ఆఫ్ ఎవ్రీథింగ్)
ఉత్తమ నటి - జూలియన్ మూర్ (స్టిల్ అలైస్)
ఉత్తమ దర్శకుడు - అలెజాండ్రో గోంజాలెజ్ ఇనారిట్టు (బర్డ్‌మ్యాన్)
ఉత్తమ విదేశీ భాషా చిత్రం - ఇడా (పోలెండ్ చిత్రం)
* చలనచిత్ర రంగంలో ప్రపంచ అత్యుత్తమ పురస్కారాలుగా భావించే ఆస్కార్ అవార్డులను 1929 నుంచి ఏటా అమెరికాలో ప్రదానం చేస్తున్నారు. వీటినే 'ది అకాడమీ అవార్డ్స్‌'గా కూడా పిలుస్తారు. 'అకాడమీ ఆఫ్ మోషన్ పిక్చర్ ఆర్ట్స్ అండ్ సైన్సెస్ - ఏఎంపీఏఎస్' ఈ అవార్డులను ప్రదానం చేస్తోంది.
* ఆస్కార్ అవార్డుల ప్రదానోత్సవాన్ని తొలిసారిగా 1953లో టీవీలో ప్రసారం చేశారు. ఆస్కార్ తొలి ఉత్తమ నటుడిగా ఎమిల్ జెన్నింగ్స్, తొలి ఉత్తమ నటిగా జానెట్ గేనర్‌లు పురస్కారాలు పొందారు.
* భారత దేశానికి తొలి ఆస్కార్ సాధించిన ఘనత భాను అథయాకు దక్కింది. ఆమె 1983లో హాలీవుడ్ సినిమా 'గాంధీ'కి ఉత్తమ కాస్ట్యూమ్ డిజైనర్‌గా ఆస్కార్ పురస్కారాన్ని పొందారు. 1992లో సత్యజిత్‌రే ఆస్కార్ జీవిత సాఫల్య పురస్కారాన్ని పొందారు. 2009లో 'స్లమ్ డాగ్ మిలియనీర్' చిత్రానికిగాను ఏఆర్ రెహ్మాన్ (ఉత్తమ సంగీతం), రసూల్ పూకుట్టి (ఉత్తమ సౌండ్ మిక్సింగ్), ఏఆర్ రెహ్మాన్, గుల్జార్ (ఉత్తమ ఒరిజినల్ పాట)లు ఆస్కార్ అందుకున్నారు.
* రెండు ఆస్కార్ పురస్కారాలు పొందిన తొలి భారతీయుడిగా ఏఆర్ రెహ్మాన్ వార్తల్లో నిలిచారు. మూడు భారతీయ చిత్రాలు మదర్ ఇండియా (1958), సలాం బాంబే (1989), లగాన్ (2002)లు ఉత్తమ విదేశీ భాషా చిత్రం కేటగిరీలో నామినేషన్లు పొందాయి.
'ఎబోలా'కు మందు!

* ఆసియాకు చెందిన టెట్రాండ్రిన్ అనే మూలిక నుంచి సేకరించిన అణువు ఎబోలా నుంచి రక్షణ కల్పిస్తుందని టెక్సాస్ పరిశోధకుల అధ్యయనంలో తేలింది. వైరస్ ప్రవేశించడానికి, కణాల్ని ఇన్‌ఫెక్షన్‌కు గురిచేయడానికి ఉపయోగించే మార్గాల్ని ఇది మూసివేస్తుందని పరిశోధకులు గుర్తించారు. టెట్రాండ్రిన్ సూక్ష్మ అణువుకు మానవ తెల్ల రక్తకణాల ఇన్ఫెక్షన్‌ను అణచిపెట్టే శక్తి ఉన్నట్లు ఎలుకల్లో చేపట్టిన ప్రయోగాల్లో తేలింది.
'కీ స్టోన్ ఎక్స్ఎల్‌'ను తిరస్కరించిన ఒబామా

* కెనడా నుంచి అమెరికాలోని గల్ఫ్ ఆఫ్ మెక్సికో తీరం వరకు 1900 కి.మీ.ల మేర నిర్మించతలపెట్టిన వివాదాస్పద 'కీ స్టోన్ ఎక్స్ఎల్' ముడిచమురు పైప్‌లైన్ నిర్మాణాన్ని అమెరికా అధ్యక్షుడు ఒబామా తన వీటో అధికారం ఉపయోగించి తిరస్కరించారు. అధ్యక్షుడిగా ఆరేళ్లకు పైగా పాలనలో ఉన్న బరాక్ ఒబామా వీటో అధికారాన్ని ఉపయోగించడం ఇది మూడోసారి.
రికార్డు స్థాయిలో తృణ ధాన్యాలు

* 2014లో ప్రపంచ తృణ ధాన్యాల ఉత్పత్తి రికార్డు స్థాయిలో 2,534 మిలియన్ టన్నులుగా నమోదైనట్లు ఎఫ్ఏవో (ఫుడ్ అండ్ అగ్రికల్చరల్ ఆర్గనైజేషన్) ఇటీవల వెల్లడించింది. 2013తో పోలిస్తే ఇది 13 మిలియన్ టన్నులు ఎక్కువ. ప్రపంచవ్యాప్తంగా 1,104 మిలియన్ టన్నుల తృణ ధాన్యాలు ఆహార పదార్థాలుగా, 876 మిలియన్ టన్నులు జంతువుల ఆహారం కోసం వినియోగిస్తున్నట్లు ఎఫ్ఏఓ వెల్లడించింది.
* ఎఫ్ఏవో గణాంకాల ప్రకారం ప్రపంచంలో ఆకలితో బాధపడుతున్నవారి సంఖ్య గత దశాబ్దకాలంలో 100 మిలియన్లు తగ్గింది. ఇదే కాలంలో తృణ ధాన్యాల ఉత్పత్తి దాదాపుగా 500 మిలియన్ టన్నులు పెరిగింది.
2013-14లో భారత్‌లో 245.5 మిలియన్ టన్నుల తృణ ధాన్యాలు ఉత్పత్తి అయ్యాయి.

No comments:

Post a Comment

JOBS OPPORTUNITIES IN MANCHERIAL

మంచేరియల్ లో ఉద్యోగ అవకాశాలు